ఆర్టీసి చార్జీల పెంపునకు రంగం సిద్ధం
హైదరాబాద్: బస్సు చార్జీలను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపియస్ ఆర్టీసి) రంగం సిద్ధం చేసుకుంది. ఆర్టీసి చార్జీల పెంపునకు గత ఏడాది నవంబర్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారావు అంటున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఆర్టీసి చార్జీల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2003 నుంచి చార్జీలు పెంచలేదని, అందుకే పెంపు అనివార్యమైందని కృష్ణారావు చెబుతున్నారు. చార్జీల కొత్త రేట్లను ఆర్టీసి సోమవారం ప్రకటించనుంది. చార్జీలు ఏ మేరకు పెంచాలనే విషయంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కృష్ణా రావు చెప్పారు. చార్జీలు 10 -15 శాతం పెరగవచ్చునని భావిస్తున్నారు. విద్యార్థుల బస్ పాస్ రేట్లు పెరగవచ్చునని అంటున్నారు. నష్టాన్ని పూడ్చుకోవడానికి చార్జీల పెంపు తప్పడం లేదని కృష్ణారావు అంటున్నారు.