కాకా విజ్ఞప్తిపై వైయస్ నో కామెంట్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి తన పేరును పరిశీలించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకటస్వామి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి చేసిన విజ్ఞప్తిపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నిరాకరించారు. కేంద్ర మంత్రి వర్గంలో కొందరికి స్థానం లభించకపోవడంలో తన ప్రమేయం ఏదీ లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బలహీనవర్గాలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని విమర్శించడం సరైంది కాదని, ఇది దేశవ్యాప్తంగా చూడాల్సిన అంశమని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఒప్పందం ప్రకారం రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికల్లో సీటును సిపిఐకి కేటాయిస్తామని ఆయన చెప్పారు.
ఫ్యాబ్సిటీ ఏర్పాటుపై కేంద్ర ఐటి మంత్రి దయానిధి మారన్ అధికార ప్రకటన చేయడమే తరువాయి అని ఆయన అన్నారు. ఫ్యాబ్సిటీ రాష్ట్రానికి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఆయన దయానిధి మారన్ను కలుసుకుని ఫ్యాబ్సిటీ ఏర్పాటుపై మాట్లాడారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు నిధులు అధికంగా కేటాయించాలని ఆయ కేంద్ర మంత్రిని కోరారు. భారత్ నిర్మాణ్ పథకం కింద రెండున్నర కోట్ల ఎకరాల భూములను అదనంగా సాగులోకి తేవాలని నిర్దేశించడం జరిగిందని, ఇందులో కోటి ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్కు చెందిందే ఉంటుందని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం 600 కోట్ల రూపాయలు కేటాయిస్తే మార్గదర్శక సూత్రాల వల్ల 450 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలిగామని ఆయన చెప్పారు. అందువల్ల సత్వర సాగునీటి ప్రయోజన పథకం మార్గదర్శక సూత్రాలు మార్చాలని తాను చిందంబరాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.