తెలంగాణకు కాంగ్రెస్ అడ్డంకులు: నరేంద్ర
మెదక్/ హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే అడ్డంకిగా మారిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర విమర్శించారు. బిజెపి, సిపియంలతో పాటు అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా కాంగ్రెస్ తాత్సారం చేస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అభివృద్ధి నినాదం పేరుతో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
అసంతుష్ట శాసనసభ్యులపై తాము చర్యలు తీసుకోబోమని, పార్టీలోనే ఉంచుకుని నరకం చూపిస్తామని ఆయన అన్నారు. అసంతుష్ట శాసనసభ్యులను ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాదాక్రాంతుల్ని చేసుకున్నారని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించడానికి తాము మరో రెండు నెలలు కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. ఇంకా ఆలస్యం చేస్తే రాజీనామాలు చేసి పోరాడుతామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో నమ్మకద్రోహానికి పాల్పడితే తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేపడితే బిజెపితో కలిసి పని చేయడానికి తాము సిద్ధమేనని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ను వీడి బయటకు వస్తే తాము తెరాసతో పొత్తు పెట్టుకునే విషయాన్ని ఆలోచిస్తామని బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ హైదరాబాద్లో అన్నారు. కాంగ్రెస్తో కలిసి ఉన్నంత వరకు తెరాసతో పొత్తు ఉండదని, 2004లోనూ తాము ఇదే విషయాన్ని చెప్పామని ఆయన అన్నారు.