ఉపరాష్ట్రపతికి హైదరాబాద్లో కంటి పరీక్షలు
హైదరాబాద్: ఉప రాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్ మంగళవారంనాడు హైదరాబాద్లోని ఎల్.వి. ప్రసాద్ ఆస్పత్రి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోగులను రోడ్డుపైకి నెట్టేశారు. కంటి శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు కూడా రోడ్డుపై ఎండలో పడిగాపులు పడాల్సి వచ్చింది.
బైరాన్ సింగ్ షెకావత్ను తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు కలుసుకన్నారు. కంటి చికిత్స అనంతరం షెకావత్ బిజెపి మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఎన్. ఇంద్రసేనారెడ్డి, మంత్రి షబ్బీర్ అలీ కలుసుకున్నారు. చంద్రబాబుతో తనకు గల సాన్నిహిత్యాన్ని షెకావత్ గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు, షెకావత్లు దాదాపు అరగంట సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అనంతరం వారందరూ సహపంక్తి భోజనం చేశారు. తాను మర్యాదపూర్వకంగానే షెకావత్తో మాట్లాడానని చంద్రబాబు చెప్పారు.