కెసిఆర్, నరేంద్రలకు ప్రజలే నరకం చూపిస్తారు
వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గడువులు పెడుతూ మభ్యపెడుతున్న తమ పార్టీ అగ్రనేతలు కె. చంద్రశేఖర్రావు, ఎ. నరేంద్రలకే ప్రజలు నరకం చూపిస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యురాలు బండారు శారారాణి వ్యాఖ్యానించారు. అసంతుష్ట శాసనసభ్యులకు నరకం చూపిస్తామని నరేంద్ర చేసిన వ్యాఖ్యపై ఆమె బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసం ఉద్యమాలు చేయకుండా తమ పార్టీ అగ్రనేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె విమర్శించారు. అసమ్మతి శాసనసభ్యుడు ఎస్. సంతోష్ రెడ్డిని కె. చంద్రశేఖర్ రావు ప్రలోభపెట్టి లొంగదీసుకున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. తాము తెలంగాణకు గడువులు పెట్టలేదని, తాము రెచ్చగొట్టే ప్రకటనలు చేయలేదని, చేసిందంతా తమ అగ్రనాయకులేనని ఆమె అన్నారు. నాయకత్వం ఆహ్వానిస్తే ఈ నెల 12వ తేదీన జరిగే పోలవరం గర్జనకు హాజరవుతామని ఆమె చెప్పారు.