తెరాసతో టిడిపికి తేడా ఏది?: సిపిఐ ప్రశ్న
విజయవాడ: రాయలసీమలో తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ఎత్తు పెంచే విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై తెలుగుదేశం పార్టీ అర్థం లేని విమర్శలు చేస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడం వల్ల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు ఎత్తు పెంచడం కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు అవసరమని ఆయన చెప్పారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచడాన్ని విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య తేడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చాలా సున్నితమైన విషయమని, సాగునీటి ప్రాజెక్టులపై ఆయా ప్రాంతాలవారిని తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టడం అవకాశవాదం అవుతుంది గానీ రాజకీయం కాదని ఆయన అన్నారు.
నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఈ అంశంపై తాము ఈ నెల 22వ తేదీ నుంచి ఉద్యమాలు చేపడతామని ఆయన చెప్పారు. రాజ్యసభ సీటును తమకు కేటాయించడంపై తెరాస విమర్శలు చేయడం సరి కాదని, అంతా అవగాహన ప్రకారమే జరుగుతోందని ఆయన అన్నారు. శాసనసభ ఎన్నికల్లో తమకు తక్కువ సీట్లు కేటాయించినందున రాజ్యసభ సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ ఇది వరకే అవగాహన కుదుర్చుకుందని, ఆ అవగాహన మేరకే తమకు రాజ్యసభ సీటు కేటాయిస్తోందని ఆయన అన్నారు. కావాలంటే తెరాస తాను సీటును కోరవచ్చునని, తమను విమర్శించడం సరి కాదని ఆయన అన్నారు.