ఇందిరమ్మ పథకం జన్మభూమి కాదు: వైయస్
గుంటూరు/ ఒంగోలు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్వహించిన జన్మభూమి తాము చేపట్టిన ఇందిరమ్మ పథకం ఒకటి కావని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ పథకం గ్రామసభల్లో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి గుంటూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ పథకం కార్యక్రమాన్ని చేపట్టలేదని ఆయన స్ఫష్టం చేశారు. ఎన్నికలప్పుడు తప్ప రాజకీయాల గురించి ఆలోచించబోనని గతంలో తెలుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు పదే పదే చేసిన ప్రకటనను ఆయన ఎద్దేవా చేశారు.
గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ఇందిరమ్మ పథకం ఉద్దేశమని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి ఇందిరమ్మ గ్రామసభలో ఆయన శుక్రవారంనాడు పాల్గొన్నారు. మొదట ఆయన ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. ఇందిరమ్మ పథకం కింద నిరుపేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు.
వచ్చే ఏడాది మూడున్నర కోట్ల రూపాయలతో నాగార్జున సాగర్ కాలువల ఆధునీకరణ పనులు చేపడతామని ఆయన చెప్పారు. పేదల అభివృద్ధికి తాము కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు లేని పోని విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అనంతరం ఆయన గుంటూరు జిల్లాలో పర్యటించారు.