పాలార్ ప్రాజెక్టుపై సుప్రీంకెక్కిన తమిళనాడు
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం శాసనసభా నియోజకవర్గంలో తలపెట్టిన పాలార్ ప్రాజెక్టును సవాల్ చేస్తూ తమిళనాడు జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని జయ ప్రభుత్వం ఆరోపించింది. కర్ణాటకలో పుట్టి ఆంధ్రప్రదేశ్ గుండా పోతూ తమిళనాడు 200 కిలోమీటర్లు ప్రవహించే పాలార్ నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది.
దిగువ రాష్ట్రం అనుమతి లేకుండా ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మించడం నిబంధనలకు విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. పాలార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ జయలలిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి లేఖలు రాశారు. జయ లేఖలకు రాజశేఖర్ రెడ్డి జవాబు ఇవ్వలేదు. దీంతో పెరుగుతున్న ప్రతిపక్షాల ఒత్తిడి నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.