రైతు మృతి: దామినేడు రైతుల ధర్నాతో ఉద్రిక్తత
తిరుపతి: చిత్తూరు జిల్లా దామినేడు రైతులు మరణించిన రైతు దొరస్వామి మృతదేహంతో ధర్నాకు దిగడంతో ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ పోలీసులు పెద్ద యెత్తున మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. తమ భూముల్లో ప్రభుత్వ నిర్మాణాలను రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులపై కేసులు పెట్టారు.
కేసుల్లో రైతులు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దొరస్వామి అనే రైతు గుండెపోటుతో మరణించాడు. ఆ రైతు మృతదేహంతో రైతులు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పనులను ఆపుతామని ఎమ్మార్వో హామీ ఇచ్చినా రైతులు దిగి రాలేదు. కలెక్టర్ భూముల వద్దకు వచ్చి పనులను ఆపితేనే తాము ధర్నాను విరమించుకుంటామని వారు పట్టుపట్టి కూర్చున్నారు. అధికారులు దిగిరాకపోతే దొరస్వామి అంత్యక్రియలు ఎమ్మార్వో కార్యాలయం వద్దనే దహనం చేసి స్మారక స్థూపం నిర్మిస్తామని రైతులంటున్నారు.