పాక్పై భారత్ ఘన విజయం: సిరీస్ కైవసం
ముల్తాన్: పాకిస్థాన్పై జరిగిన నాలుగో క్రికెట్ వన్డే మ్యాచ్లో భారత్ సునాయస విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్లో వరుసగా మూడు విజయాలు సాధించి భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. భారత్ పాకిస్థాన్పై 3-1 స్కోర్తో సిరీస్ను గెలుచుకుంది. భారత్ పాకిస్థాన్ గడ్డపై ఆ దేశం క్రికెట్ జట్టు మీద సిరీస్ విజయం సాధించడం ఇది రెండో సారి. భారత్ ఐదు వికెట్ల తేడాతో నాలుగో టెస్టులో విజయం సాధించింది. భారత్ 32.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారత బౌలర్ల ధాటికి 41.5 ఓవర్లలోనే వికెట్లన్నీ కోల్పోయి 161 పరుగులు చేసింది. ఇంజమామ్ హుల్ హక్ తప్ప మిగతా ఎవరూ పెద్దగా భారత బౌలర్ల ముందు నిలదొక్కుకోలేకపోయారు. ఇంజమామ్ 49 పరుగులు చేశాడు. ఆర్పీ సింగ్ నాలుగు, పఠాన్ మూడు వికెట్లు తీసుకున్నారు. సచిన్ టెండూల్కర్కు ఒక వికెట్ వచ్చింది.
స్వల్ప స్కోర్ లక్ష్యంగా బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి దశలో ఒడిదొడుకులను ఎదుర్కుంది. జట్టు స్కోర్ ఐదు పరుగులు ఉన్నప్పుడు సచిన్ టెండూల్కర్ డకవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఆచితూచి ఆడుతూ 59 పరుగులు చేశాడు. ఇది ద్రావిడ్కు వన్డేల్లో 67వ అర్థసెంచరీ. యువరాజ్ సింగ్ 37 పరుగులు చేశాడు. చివరలో సురేష్ రైనా చక్కటి బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించాడు. రైనా 35 పరుగులు చేసి నాటవుట్గా మిగిలాడు. సమీకి మూడు వికెట్లు లభించాయి.