అసెంబ్లీకి బాంబు బెదిరింపు: తనిఖీలు
హైదరాబాద్: శాసనసభకు శుక్రవారం బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. శాసనసభలో బాంబు పెట్టినట్లు పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ కాల్ వచ్చింది. ఈ సమాచారం తెలిసన వెంటనే శాసనసభ్యులు హడావిడిగా సభ బయటకు వచ్చారు. ఆ వెంటనే బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగింది. శాసనసభ్యులను బయటకు పంపి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
పది నిమిషాల పాటు తనిఖీలు జరిగాయి. తనిఖీలకు శునకాలను కూడా ఉపయోగించారు. బాంబు బెదిరింపు ఉత్తుత్తిదే అని తేలడంలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత శాసనసభా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగాయి. అసెంబ్లీకి బాంబు బెదిరింపుపై దర్యాప్తు జరుగుతుందని హోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు. ఫోన్కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆరా తీస్తారని ఆయన చెప్పారు. సమాచారం అందినప్పుడు పోలీసులు అప్రమత్తమై వెంటనే తగిన చర్యలు తీసుకోవడం పరిపాటి అని ఆయన చెప్పారు.