కొల్లేరు ప్రక్షాళన: కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత
విజయవాడ: కొల్లేరు ప్రక్షాళన సందర్బంగా కృష్ణా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శృంగవరపుపాడులో చేపల చెరువులను ధ్వంసం చేస్తున్న ప్రొక్లెయిన్లను ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో పెద్ద యెత్తున పోలీసు బలగాలను మోహరించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం కొల్లేరు ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. అయితే కొల్లేరు ఆక్రమణదారులు చెరువుల తొలగింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
శనివారంనాడు కొల్లేరు ప్రక్షాళనను నిరసిస్తూ ఆ ప్రాంతవాసులు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు లాఠీచార్జి చేసేంత వరకు పరిస్థితి వెళ్లింది. ఏలూరులో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. చేపల చెరువులను అడ్డుకునేవారిపై కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధపడి చేపల చెరువుల తొలగింపునకు రంగంలోకి దిగింది.