రాష్ట్రానికి బర్డ్ఫ్లూ ప్రమాదం లేదు
హైదరాబాద్: బర్డుఫ్లూ మహారాష్ట్రను కుదిపేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, కోళ్ల పరిశ్రమ అప్రమత్తమైంది. దేశంలోనే కోళ్ల పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. కోళ్ల పరిశ్రమ ఉత్పత్తిలో మూడో వంతు ఇక్కడి నుంచే జరుగుతుంది. ఈ నేపథ్యంలో బర్డు ఫ్లూ వ్యాధి సోకకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్, దాని పరిసరాల్లో పెద్ద యెత్తున కోళ్ల పరిశ్రమ విస్తరించి వుంది. బర్డుఫ్లూ ముప్పు వాటిల్లబోదని కోళ్ల పరిశ్రమ వర్గాలంటున్నాయి. తూర్పు ఆసియా దేశాల నుంచి వేసవికి ముందు వలస వచ్చే అవకాశాలున్నాయని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే వలస పక్షుల తాకిడి వేసవికి ముందే ప్రారంభమైంది. దీంతో అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నారు. ఫార్మాల్డిహైడ్ వంటి వాటితో శుభ్రం చేయడం వంటి చర్యలు తీసుకోవడంతో పాటు చనిపోయిన కోళ్లను కాల్చివేసే ప్రక్రియను ప్రారంభించారు.
బహుళజాతి కంపెనీ రోషే బర్డ్ఫ్లూకు తామిఫ్లూ అనే మందును కనిపెట్టి తయారు చేస్తోంది. దీని తయారీకి పేటెంట్ హక్కులు ఇతర కంపెనీలకు లేవు. అయితే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ తామిఫ్లూను తయారు చేసి సరఫరా చేసేందుకు హక్కులు పొందింది. దీంతో డ్రగ్ సరఫరాకు ఆ కంపెనీ సిద్ధమైంది.