రైల్వే స్టేషన్లో భారీ పేలుడు: పలువురికి గాయాలు
అహ్మదాబాద్: అహ్మదాబాద్లోని కాలుపూర్ రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఈ పేలుడులో పది మంది దాకా గాయపడ్డారు. ఈ సంఘటన తీవ్ర ఆందోళనను సృష్టించింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటా 55 నిమిషాలకు పేలుడు సంభవించింది. అ సమయంలో ప్లాట్ఫారమ్పై రైళ్లేవీ లేవు.
ఈ పేలుడుకు బాధ్యులెవరనేది ఇప్పటి వరకు తేలలేదని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎ.కె. భార్గవ చెప్పారు. ఆర్డియక్స్ వాడారా, లేదా అనేది ఇప్పుడే ఏమీ చెప్పలేమని, నిపుణులు పేలుడు పదార్థాల తునకలను పరిశీలించిన తర్వాతనే ఏమైనా చెప్పగలమని ఆయన అన్నారు. ఈ సంఘటనలతో రాష్ట్రంలోని అన్ని నగరాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేశారు. పోలీసులను అప్రమత్తం చేశారు. కచ్ ఎక్స్ప్రెస్ కొద్దిసేపట్లో ప్లాట్ఫారమ్ మీదికి వస్తుందనగా ఈ పేలుడు సంభవించింది. అప్పటికే రెండు రైళ్లు వెళ్లిపోయాయి.
గాయపడినవారిలో ఇద్దరు రైల్వే స్టాల్ కార్మికులు. మిగతావారు రైళ్ల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు. పేలుడులో రెండు స్టాల్స్ ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి ప్లాట్ఫారమ్ పైకప్పు దగ్ధమైంది. ఒకటో ప్లాట్ఫారమ్పై కొన్ని కార్యాలయాలు కూడా ధ్వంసమయ్యాయి.