లోక్సభలో తెలుగులో ప్రశ్న వేసిన రాయపాటి
న్యూఢిల్లీ: లోక్సభలో ఒక సభ్యుడు తెలుగులో ప్రశ్న వేసి తెలుగులోనే మంత్రి సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు మానవ వనరుల శాఖ మంత్రికి ఒక ప్రశ్న వేశారు. అయితే ఆంగ్లంలో ప్రశ్న వేయాలని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సూచించారు. అందుకు రాయపాటి సాంబశివరావు నిరాకరించారు. ఈ రోజు (మంగళవారం) మాతృభాషా దినోత్సవమని అందువల్ల తాను తెలుగులోనే ప్రశ్న వేస్తానని, మంత్రి కూడా తెలుగులోనే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
తెలుగులో వేసిన ప్రశ్నను ఇంగ్లీషులో వివరించాలని స్పీకర్ సూచించారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. ఏం ప్రశ్న వేశారో నాకు అర్థం కావాలి కదా అని స్పీకర్ అన్నారు. రాయపాటి సాంబశివరావు ఆ ప్రశ్న వేసింది మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి కావడం విశేషం. ఆమె కూడా తెలుగువారే కావడంతో తెలుగులోనే సమాధానం చెప్పాలనేది రాయపాటి ఉద్దేశ్యం.