ఎమ్మార్వోపై ఎమ్మెల్యే, ఆయన అనుచరుల దాడి
రాజమండ్రి: మండల రెవెన్యూ అధికారి ( ఎమ్మార్వో) బాబూరావుపై దాడి చేశారనే ఆరోపణపై శాసనసభ్యుడు తోట నరసింహంపై, ఆయన అనుచరులు 30 మందిపై కేసులు నమోదు చేశారు. వారి దాడితో ఎమ్మార్వో బాబురావు ఆస్పత్రి పాలయ్యారు. ఈ దాడికి నిరసనగా కాకినాడ డివిజన్లోని అన్ని ఎమ్మార్వో కార్యాలయాలకు తాళాలు వేశారు. ఆర్డీవో కార్యాలయాన్ని కూడా మూసేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని ఎమ్మార్వోలు విధులు బహిష్కరించారు.
బాబూరావు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా వాహనాలను స్వాధీనం చేసుకునే బాధ్యతను ఎమ్మార్వో గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. బాబూరావు స్వాధీనం చేసుకున్న వాహనాలు తోట నరసింహం అనుచరులవని తేలింది. దీంతో వారు శాసనసభ్యుడి వద్దకు మొర పెట్టుకున్నారు. శాసనసభ్యుడు చెప్పినా ఎమ్మార్వో వినలేదు. దీంతో తోట నరసింహం అనుచరులు ముప్పై మంది ఎమ్మార్వోపై దాడి చేశారు. ఈ దాడితో ఎమ్మార్వోకు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాబూరావును జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటిండెంట్, జాయింట్ కలెక్టర్ పరామర్శించారు. దళితుడు కావడం వల్లనే బాబూరావుపై శాసనసభ్యుడి అనుచరులు దాడి చేశారని మాల మహానాడు ఆరోపించింది. వారిపై ఎస్సి, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.