బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: తెరాస
హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధికార ప్రతినిధి ప్రకాశ్ విమర్శించారు. తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. భౌగోళికంగానే కాకుండానే జనాభాపరంగా కూడా తెలంగాణకు 40 శాతానికి పైగా నిధుల కేటాయింపు జరగాలని, అయితే 30 శాతం నిధుల కేటాయింపు కూడా జరగలేదని ఆయన చెప్పారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి అంటూ వస్తున్నారని, ఆ రకంగా తెలంగాణకు 50 శాతం దాకా నిధుల కేటాయింపు జరగాలని ఆయన అన్నారు. అయితే ముఖ్యమంత్రి హామీలు నోటి మాటలేనని తేలిపోయిందని ఆయన అన్నారు. ఈ స్థితిలో సమైక్యాంధ్రలో న్యాయం జరగదని తేలిపోయిందని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడే న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.