రాజ్నాథ్తో కెసిఆర్ భేటీ తప్పు కాదు: జైస్వాల్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలవడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జైస్వాల్ ఆచితూచి స్పందించారు. చంద్రశేఖర్ రావు రాజ్నాథ్ సింగ్ను కలవడం అపరాధమేమీ కాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణపై తమ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. తెరాస అభిప్రాయం కూడా తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ఎందుకు తీసుకోం, అది మా మిత్రపక్షం కూడా అని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు చంద్రశేఖర్ రావు మంగళవారం సాయంత్రం రాజ్నాథ్ సింగ్ను కలిశారు. ఒకటి రెండు వారాల్లో ముఖ్య నాయకులతోనూ, ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకులతోనూ చర్చించి తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని రాజ్నాథ్ సింగ్ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.