పరిశ్రమల ఖాయిలాపై విపక్షాల వాకౌట్
హైదరాబాద్: మూత పడిన పరిశ్రమలను తిరిగి తెరిపించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శిస్తూ ప్రతిపక్షాలు గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వాకౌట్ చేశారు. గురువారం సభ సమావేశం కాగానే వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. 610 జీవోపై వామపక్షాలు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంపై చర్చకు తెరాస వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాయి. వాటిని స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి తిరస్కరించారు. అయితే వామపక్షాలు, తెరాస పట్టు వీడకపోవంతో దాదాపు 10 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు స్తంభించాయి. అనంతరం ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది.
ఖాయిలా పరిశ్రమలను తెరిపించడంలో ప్రభుత్వం విఫలమైందని జి. కిషన్ రెడ్డి (బిజెపి) ప్రభుత్వాన్ని విమర్శించారు. గత రెండేళ్లలో కార్మికులకు ఉపాధి కల్పించడంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. బిజెపితో వామపక్షాలు, తెరాస గొంతు కలిపాయి. తమ పార్టీ హయాంలో పరిశ్రమల అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు పరిశ్రమల అభివృద్ధి కుంటుపడిందని తెలుగుదేశం పార్టీ తనదైన శైలిలో చెప్పుకుంది. మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి జె. గీతారెడ్డి ఇచ్చిన సమాధానంతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. దాంతో వాకౌట్ చేశాయి.