బాబ్రీ వివాదంపై పార్లమెంటులో దుమారం
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) వ్యవహారాల్లో ప్రధానమంత్రి కార్యాలయం జోక్యంపై గురువారం పార్లమెంటు ఉభయ సభలు అట్టుడుకాయి. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో ప్రతిపక్ష నేత ఎల్.కె. అద్వానీపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రధాని కార్యాలయం అడగడంపై ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆందోళనకు దిగాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
ప్రధాని కార్యాలయం జోక్యంపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) లోక్సభలో డిమాండ్ చేసింది. ప్రధాని రాజీనామాకు బిజెపి పట్టుబట్టడంతో లోక్సభ ఉదయంపూట ఒకసారి వాయిదా పడింది. తిరిగి పదకొండున్నర గంటలకు సభ సమావేశమైనప్పుడు వామపక్షాలు, రాష్ట్రీయ జనతా దళ్ సభ్యులు ఇతర అంశాలపై మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే బిజెపి సభ్యులు వారితో వాగ్వివాదానికి దిగారు.
ప్రధాని కార్యాలయం వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాజ్యసభలో బిజెపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. సభ సమావేశం కాగానే బిజెపి సభ్యుడు జస్వంత్ సింగ్ ఆ వ్యవహారంపై ప్రభుత్వ వివరణ కోరారు. ఈ విషయంపై మాట్లాడడానికి అరుణ్ జైట్లీకి అవకాశం ఇవ్వాలని జస్వంత్ సింగ్ రాజ్యసభ చైర్పర్సన్ బైరాన్ సింగ్ షెకావత్ను కోరారు. అయితే ఈ విషయంపై మన్మోహన్ సింగ్ ఇవ్వాలనుకుంటున్నారని, అందువల్ల ఎవరినీ అనుమతించేది లేదని షెకావత్ చెప్పారు. అయితే అరుణ్ జైట్లీకి అవకాశం ఇవ్వాల్సిందేనని బిజెపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో షెకావత్ సభను వాయిదా వేశారు.