తెరాస ఎమ్యెల్యే నాయని ప్రవర్తపై స్పీకర్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి ప్రవర్తన పట్ల స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి గురువారం శాసనసభలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాయిలా పరిశ్రమలపై ప్రశ్తోత్తరాల సమయంలో సభ్యులు మాట్లాడుతున్నప్పుడు తనకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని నాయని నరసింహా రెడ్డి స్పీకర్ను కోరారు. నోటిసు ఇవ్వనందున నాయని నరసింహారెడ్డికి స్పీకర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.
స్పీకర్ తిరస్కరణకు అసంతృప్తి చెందిన నాయని నరసింహారెడ్డి పెద్దగా కేకలు వేశారు. ఆ తర్వాత స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ఈ సమయంలో స్పీకర్ - ఇది శాసనసభ. ఇది మరోటి కాదు. అనుచిత ప్రవర్తన మంచిది కాదు అని నాయనితో అన్నారు. నాయని నరసింహారెడ్డి వ్రపర్తన వల్ల సభా గౌరవం తగ్గుతుందని స్పీకర్ అన్నారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య జోక్యం చేసుకుని - నాయని నరసింహారెడ్డి వెనక్కి తగ్గాలని, వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. తమ సభ్యుడు నాయని స్పీకర్ గౌరవానికి ఏ విధమైన భంగం కలిగించలేదని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు అన్నారు. నాయని నరసింహారెడ్డి మామూలుగా మాట్లాడితే మరోలా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు జాగ్రత్త పడాలని స్పీకర్ ఆదేశించారు.