బెస్ట్ బేకరీ కేసు: 9 మందికి జీవిత ఖైదు
ముంబాయి: బెస్ట్ బేకరీ కేసులో తొమ్మిది మందికి జీవిత ఖైదు పడింది. గోద్రా ఊచకోత అనంతరం వడదొరాలో బెస్ట్ బేకరీ దగ్ధం సంఘటనలో 14 మంది మరణించిన కేసులో 17 మందిపై అభియోగాలు మోపగా 9 మందిపై ఆరోపణలు రుజువైనట్లు ముంబాయి సెషన్స్ కోర్టు తెలియజేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పునర్విచారణ జరిపిన న్యాయమూర్తి అభయ్ థిప్సే ఎనిమిది మందికి కేసు నుంచి విముక్తి కల్పించారు.
జహీరా షేక్తో పాటు సాక్షులందరికీ కోర్టు నోటీసులు జారీ చేసింది. నేరంలో నిర్వర్తించిన నిర్దిష్ట పాత్రల గురించి స్పష్టం కానందున వారికి మరణశిక్ష వేయలేదని న్యాయమూర్తి చెప్పారు. బెస్ట్ బేకరీ కేసుపై తిరిగి విచారణ చేయాలని సుప్రీంకోర్టు 2004 ఏప్రిల్ 12వ తేదీన ముంబాయి కోర్టును ఆదేశించింది. 21 మంది నిందితులను కేసు నుంచి విముక్తి చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు పునర్విచారణకు ఆదేశించారు.