బాగుంది: వైయస్, ఏం బాగు లేదు: ఎంపీలు
హైదరాబాద్/న్యూఢిల్లీ: గతంతో పోలిస్తే రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కొత్త లైన్లు ఇవ్వడం శుభ పరిణామమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రైల్వే బడ్జెట్లో ప్రయాణికులపై చార్జీలు తగ్గించడం ఆహ్వానించదగిన విషయమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కొత్త ప్రాజెక్టులు మరిన్న నిధులు కేటాయించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు.
అయితే రైల్వే బడ్జెట్పై రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు పెదవి విరిచారు. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్పర్సన్ సోనియా గాంధీ, రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్లకు తెలియజేశామని ఆయన అన్నారు.
రైల్వే బడ్జెట్లో వెనకబడిన తెలంగాణ ప్రాంతానికి కొంత మేలు జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యుడు వినోద్కుమార్ అన్నారు. రాష్ట్రంలోని రెండు కొత్త లైన్లకు కేటాయింపులు జరిపారని, ఇందులో సికింద్రాబాద్ - కరీంనగర్ లైన్ ఒకటని ఆయన చెప్పారు. వెనకబడిన ప్రాంతమైన తెలంగాణకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని తాము లాలూను కోరామని, దాంతో సికింద్రాబాద్ - కరీంనగర్ లైన్కు కేటాయింపులు జరిపారని ఆయన చెప్పారు. దక్షిణ మధ్య రైల్వేలో ఖాజీపేటను డివిజన్గా చేయాలనే తమ విజ్ఞప్తిని పట్టించుకోనందుకు ఆయన కొంత నిరాశ వ్యక్తం చేశారు.