బుష్ పర్యటనకు నిరసనగా ప్రజాకోర్టు
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బుష్ పర్యటనను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో 40 ప్రజాసంఘాలు ఆదివారంనాడు ప్రజా కోర్టు నిర్వహించాయి. బియస్యస్ స్వామి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ రమా మెల్కొటే జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ స్థావరాలు ఏర్పాటు చేసి యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్న బుష్ పర్యటనను వ్యతిరేకించాలని పలువురు జ్యూరీ సభ్యుల ముందు చెప్పారు. బుష్ భారత పర్యటనకు అతిథిగా రావడం లేదని మన దేశాన్ని లూటీ చేసే దోపిడీదారుగా వస్తున్నారని వారు విమర్శించారు.
బుష్ పర్యటనను వ్యతిరేకిస్తూ డివైయఫ్ఐ ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా బుష్ దిష్టిబొమ్మ దగ్ధం చేసింది. బుష్ పర్యటనకు నిరసనగా వచ్చే నెల 3వ తేదీన ఉత్తర తెలంగాణ బంద్ పాటించాలని సిపిఐ (యంయల్) మావోయిస్టు ఉత్తర తెలంగాణ నాయకుడు జంపన్న ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రకటన ఆదివారంనాడు వరంగల్లోని పత్రికా కార్యాలయాలకు చేరింది. బుష్ తన భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్కు కూడా వస్తున్నారు.