చిలుకూరు తాళం చెవులు సియంకే ఇస్తాం: సౌందరరాజన్
హైదరాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి మార్చి 12వ తేదీన ట్రస్ట్బోర్డును ఏర్పాటు చేస్తే ఆలయం తాళం చెవులు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి మాత్రమే ఇస్తామని ఆ ఆలయ ప్రధానార్చకుడు సౌందరరాజన్ చెప్పారు. ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఆయన ఉద్యమిస్తున్నారు.
దేవాలయాల రక్షణకు చట్టాన్ని సవరిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 2004లో హామీ ఇచ్చారని, అందుకే తాళం చెవులు దేవదాయ శాఖకు కాకుండా ముఖ్యమంత్రికి ఇవ్వాలని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. దేవాలయాల చట్టాన్ని సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా తిరుమలలో రేపు విఐపి, బ్రేక్ దర్శనాలను అడ్డుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. దేవాదాయ నిధి రక్షణకు కోర్టులో పిటిషన్ వేయాలని ఆయన భక్తులను కోరారు.