భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు
హైదరాబాద్: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. ఆదివారం తెల్లవారు జాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి దైవదర్శనం చేసుకున్నారు. విజయవాడలోని దుర్గాఘాట్లో ఇసుకు వేస్తే రాలనంత భక్తి జనసందోహం కూడింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం సోమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది.
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి పెద్ద యెత్తున భక్తులు వచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వ్యవసాయ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. వేయి మందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. కాళేశ్వరం కూడా భక్తులతో కిటకిటలాడింది. వరంగల్లోని వేయి స్తంభాల గుడికి కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు వచ్చారు. వరంగల్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరాలయం, కొమురవెల్లి తదితర దేవాయాలు క్రిక్కిరిసిపోయాయి.