తెలంగాణ న్యాయవాదిని నియమించండి: తెరాస
హైదరాబాద్: కొత్త బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదించడానికి తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాదిని ఎంపిక చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదించడానికి ప్రభుత్వం సరైన వ్యక్తిని ఎంపిక చేయలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
బచావత్ ట్రిబ్యునల్ ముందు వాదించడానికి సుదర్శన్ రెడ్డిని నియమించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టులో కేసులను కూడా సరిగ్గా వాదించని సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం సరి కాదని, సుదర్శన్రెడ్డి పలు కేసుల్లో సరిగా వాదించనందువల్ల కోర్టుల నుంచి ప్రభుత్వానికి అక్షింతలు పడ్డాయని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి వల్ల తెలంగాణకు రావాల్సిన నదీ జలాల వాటాకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణకు అన్యాయం చేయడానికే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వం నియమించిందని ఆయన విమర్శించారు.