బుష్ పర్యటనపై అసెంబ్లీలో రగడ
హైదరాబాద్: బుష్ పర్యటనకు వ్యతిరేకంగా గురువారం శాసనసభలో రగడ జరిగింది. దీంతో సభ కొద్దిసేపు వాయిదా పడింది. బుష్ పర్యటనకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయాలని వామపక్షాలు, మజ్లీస్ పట్టుబట్టాయి. అందుకు ప్రభుత్వం నిరాకరించింది. దీంతో మజ్లీస్ వామపక్షాల సభ్యులు నినాదాలు చేశారు. సభా కార్యక్రమాలు స్తంభించడంతో సభను స్పీకర్ కె. ఆర్.సురేష్ రెడ్డి కొద్దిసేపు వాయిదా వేశారు. గొడవ మాని ప్రజలకు ఉపయోగపడే అంశంపై చర్చకు సహకరించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య సభ్యులను కోరారు. నిరసన వ్యక్తం చేశారు కదా, దాంతో సరిపుచ్చండని కూడా ఆయన సలహా ఇచ్చారు.
అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటనకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన పదర్శనలు జరుగుతున్నాయి. బుష్ పర్యటనకు నిరసనగా గురువారంనాడు ప్రజా వాగ్గేయకారులు గద్దర్, గోరటి ఎంకన్న, జయరాజ్ తదితరులు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాకు, బుష్కు వ్యతిరేకంగా పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. బుష్ పర్యటనకు నిరసనగా హైదరాబాద్లోని బాగ్లింగపల్లి వద్ద రచయితలు, మేధావులు ధర్నా నిర్వహించారు. అమెరికా విదేశాంగ విధానం నమ్మదగింది కాదని మేధావులు అన్నారు. బుష్ పర్యటనకు మనం వ్యతిరేకించలేకపోవచ్చు గానీ కనీసం నిరసనైనా తెలియజేయడం మన బాధ్యత అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె. శివారెడ్డి అన్నారు.
బుష్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బుష్ పర్యటనకు నిరసనగా జరిగే కార్యక్రమాలు శాంతియుతంగా సాగేలా కోవా వంటి సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకుగాను కోవా వాలంటీర్లను నియమిస్తోంది. నమాజు పూర్తయిన వెంటనే ప్రశాంతంగా వెళ్లిపోవాలని కోవా ముస్లింలకు విజ్ఞప్తి చేసింది.