బుష్ పర్యటనపై రభస: పార్లమెంటు వాయిదా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పర్యటనపై గురువారం పార్లమెంటు ఉభయసభలో తీవ్ర రభస జరిగింది. బుష్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, సమాజ్వాదీ పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లోనూ అందోళనకు దిగాయి. దీంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వానికి వెలుపలి నుంచి మద్దతు తెలియజేస్తున్న సమాజ్వాదీ పార్టీ, వామపక్షాల సభ్యులు నినాదాలు చేస్తుండడంతో అధికార పక్షం ఇరకాటంలో పడింది. దీన్ని బిజెపి, దాని మిత్రపక్షాల సభ్యులు చూస్తూ కూర్చున్నాయి. అంతకు ముందు వామపక్షాలు పార్లమెంటు ఎదుట ప్రదర్శన నిర్వహించాయి. సిసిఐ, సిపియం, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్పిఐ సభ్యులు పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్లపై బైఠాయించి అమెరికాకు, బుష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానవత్వానికి అతి పెద్ద శత్రువు, 21 శతాబ్దం హంతకుడు బుష్ అని వారు నినాదాలు చేశారు. బుష్కు భారత్లో స్థానం లేదని సిపియం నాయకుడు హన్నన్ ముల్లా అన్నారు.
అఫ్గనిస్థాన్, ఇరాక్లపై దాడి తర్వాత ఇప్పుడు ఇరాన్పై దాడి చేసేందుకు బుష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. బుష్ పర్యటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు సాగుతున్నాయని ఆయన చెప్పారు.