గ్రాండ్ కాకతీయలో బుష్ విశ్రాంతి
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఐటిసి గ్రాండ్ కాకతీయలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇందుకు గ్రాండ్ కాకతీయ హోటల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000లలో వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్లో బస చేశారు. బుష్ కోసం కాకతీయలోని ప్రెసిడెన్షియల్ స్యూట్లో అన్ని హంగులూ కల్పించారు.
కాకతీయలో మొత్తం బుష్ కోసం 133 గదులు కేటాయించారు. వీటిని అమెరికా భద్రతా సంస్థలు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిఘా సంస్థల గస్తీని కూడా ఏర్పాటు చేశారు. బుష్ హైదరాబాద్ పర్యటన సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో తలపెట్టిన వైట్హౌస్ సెట్టింగ్ ఏర్పాటు బెడిసికొట్టినట్లు తెలిసింది. తాము నిత్యం వైట్హౌస్ను చూస్తూనే వుంటామని, ఇక్కడ సంస్కృతికి అద్దం పట్టేలా సెట్టింగ్ ఉంటే బాగుంటుందని అమెరికా రాయబారులు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను విరమించుకుంది. రాష్ట్రంలోని సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సెట్టింగ్ రూపకల్పనకు సిద్ధపడిందని తెలుస్తోంది. ఎద్దులు పొలాన్ని ఎలా దున్నుతాయో బుష్ చూస్తారని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు.
బుష్ పర్యటన సందర్భంగా హైదరాబాద్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బుష్ సందర్శించే ఎన్.జి. రంగా విశ్వవిద్యాలయం చుట్టూరా పది కిలోమీటర్ల దాకా ఎవరినీ అనుమతించడం లేదు. బందోబస్తుకు మొత్తం 8వేల మందిని నియోగించినట్లు సైబరాబాద్ కమీషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. 75 ప్రత్యేక బృందాలను కూడా వినిమోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానికులకు కొంత ఇబ్బంది కలిగినా తప్పదని ఆయన అన్నారు.