శ్రీపాదసాగర్పై అసెంబ్లీలో గందరగోళం
హైదరాబాద్: శ్రీపాదసాగర్ ప్రాజెక్టు విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణతో గురువారం శాసనసభలో గందరగోళం ఏర్పడింది. బడ్జెట్పై చర్చ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు ఆ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారు. శ్రీపాదసాగర్ ప్రాజెక్టుపై చర్చకు తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి నిరాకరించారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇచ్చిన వివరణతో తెలుగుదేశం పార్టీ సభ్యులు సంతృప్తి చెందలేదు.
కాంగ్రెస్వారు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆరోపించారు. శ్రీపాదసాగర్ ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్ వద్ద పరిశీలన కోసం ఉంచాలని వారు డిమాండ్ చేశారు. శ్రీపాద సాగర్లో అక్రమాలను నిరూపించే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించేందుకు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. శ్రీపాదప్రాజెక్టులో అవినీతి జరగకపోతే స్పీకర్ వద్ద ఫైళ్లు ఉంచేందుకు భయమెందుకని ఆయన అడిగారు. సమగ్ర జల విధానం లేకుండా రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని ఆయన విమర్శించారు.