పట్టువీడని టిడిపి సభ్యులు: మళ్లీ సస్పెన్షన్
హైదరాబాద్: ప్రశ్నోత్తరాల సమయానికి తెలుగుదేశం సభ్యులను స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చర్చకు పట్టుబట్టి ప్రశ్నోత్తరాల సమయానికి అడ్డు తగలడంతో స్పీకర్ ఆ చర్యకు పాల్పడ్డారు. సస్పెన్షన్ అనంతరం తెలుగుదేశం సభ్యులు సమావేశం వెలుపలికి వచ్చి ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చర్చకు అనుమతివ్వాలని తెలుగుదేశం సభ్యులు బుధవారం సభ సమావేశమైన వెంటనే డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ అనుమతించలేదు. అయితే తెలుగుదేశం సభ్యులు సద్దుమణగలేదు. దీంతో సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైన తర్వాత కూడా తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు. ప్రశ్నోత్తరాల సమయంలో పాల్గొనడం ఇష్టం లేకపోతే తెలుగుదేశం సభ్యులు బయటకు వెళ్లిపోవచ్చునని శాసనసభా వ్యవహారాల మంత్రి కె. రోశయ్య వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అంశం ముగియలేదని, తమను సస్పెండ్ మాత్రమే చేశారని, అందువల్ల తాము పట్టుబట్టడానికి నిబంధనలు అనుమతిస్తాయని తెలుగుదేశం సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. తెలుగుదేశం సభ్యులు తమ పట్టువీడకపోవడంతో స్పీకర్ వారిని ప్రశ్నోత్తరాల సమయం ముగిసే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు.