అవినీతిపై నిలదీస్తే సస్పెండ్ చేస్తారా?: సిపియం
ఏలూరు: అవినీతిపై నిలదీస్తే శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తారా అని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నించినవారిని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పార్టీ పాదయాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను స్పీకర్ ముందు పెట్టకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఫైళ్లను స్పీకర్ ముందు పెట్టడానికి ప్రభ్తువం జంకుతోందని, అలా జంకుతోందంటేనే ప్రభుత్వానికి నిజాయితీ లేదని తెలిసిపోతోందని ఆయన అన్నారు. నిజాయితీ వుంటే ఫైళ్లు స్పీకర్ ముందు ఉంచడానికి ప్రభుత్వం జంకాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలోనే కాకుండా పలు ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఆరోపణలున్నాయని ఆయన అన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి స్పష్టత లేదని, తాము ప్రత్నామ్నాయాలు చూపినా ప్రభుత్వం వినడం లేదని ఆయన అన్నారు.