ఎన్నికల్లో సిపియంకు గంగూలీ ప్రచారం
కోల్కత్తా: భారత క్రికెట్ జట్టులో స్థానం కోల్పోయిన భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల వైపు దృష్టి సారించారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో సిపియంకు మద్దతుగా ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తాము సెల్టెర్లుగా ఉన్నంత కాలం గంగూలీని ఎంపిక చేసేది లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసి) సెలెక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే ప్రకటించడం, జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్తో ఏ మాత్రం రాజీ కుదరకపోవడం, తనకు అండగా ఉంటూ వచ్చిన జగ్మోహన్ దాల్మియా ప్రభలు తగ్గడం గంగూలీ క్రికెట్ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని వేశాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దగ్గరవుతున్నారు.
భారత జట్టు నుంచి గంగూలీని తప్పించిన సమయంలో గంగూలీకి సిపియం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కూడా జోక్యం చేసుకుని గంగూలీ ఎంపికకు తోడ్పడ్డారు. అంతేకాకుండా సిపియం సభ్యులు గంగూలీని తప్పించడాన్ని ఒక సమస్యగా పార్లమెంటులో కూడా ప్రస్తావించారు. ఏ క్రికెటర్ విషయంలోనూ జరగనంత రాద్ధాంతం గంగూలీ విషయంలో జరిగింది. ఏ క్రికెటర్ను తప్పించినప్పుడు కూడా ఇంత జగడం చోటు చేసుకోలేదు. అయితే జట్టుకు గంగూలీ ఎంపిక తాత్కాలికమే అయింది. ఇంగ్లాండుతో జరుగుతున్న సిరీస్ గంగూలీని దూరంగా పెట్టారు.