అప్పుడు అడిగాం, కానీ ఇప్పుడు వద్దు: కెకె
హైదరాబాద్: ఫైళ్లను శాసనసభ ముందుంచే సంస్కృతికి స్వస్తి చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అభి।పాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు కీలకమైన ఫైళ్లను సభ ముందుంచాలని తమ పార్టీ శాసనసభ్యులు డిమాండ్ చేసిన విషయం నిజమేనని, అయితే అది మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను శాసనసభ స్పీకర్ ముందుంచాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆ విధంగా అన్నారు.
ఫైళ్లను స్పీకర్ ముందుంచుతూ పోతే దానికి అడ్డూ ఆపూ ఉండదని, ఒక్క ఫైలు పెడితే మరో ఫైలు పెట్టాలని డిమాండ్ చేస్తూ పోతారని, ఇది ఒక ఎడతెగని వ్యవహారంగా మారిపోతుందని ఆయన అన్నారు. అటువంటి వ్యవహారానికి ఎక్కడో ఒక దగ్గర పుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం వుంటుందని ఆయన అన్నారు. ఆ విధమైన వ్యవహారాన్ని ఎవరు, ఎక్కడ ఆపాలనేది పెద్ద సమస్యగా మారిపోతుందని ఆయన అన్నారు.