రాజ్యసభ సీట్లకు కాంగ్రెస్లో పోటాపోటీ
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం వేడెక్కింది. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. నామినేషన్లను ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు శాసనసభ కార్యదర్శి తుల్జానంద సింగ్ శుక్రవారంనాడు ప్రకటించారు. అవసరమైతే ఈ నెల 28వ తేదీన ఎన్నిక జరుగుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్రం నుంచి ఆరుగురు రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇందులో ఐదు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు దక్కుతాయి. మరో స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. నాలుగు సీట్లకు కాంగ్రెస్ పోటీ చేసి, ఒక స్థానాన్ని మిత్రపక్షాలకు కేటాయించబోతోంది. ఈ నాలుగు సీట్లలోనూ ఒక సీటుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి సన్నిహిత మిత్రుడు కెవిపి రామచందర్రావుకు దాదాపుగా ఖాయమైంది. మరోస్థానానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు పేరు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సరోజినీ పుల్లారెడ్డికి ఇచ్చే విషయంలో కేశవరావుకు ఆ సీటు దక్కకపోవచ్చునని అంటున్నారు. రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ నాయకులు పాల్వాయి గోవర్దన్రెడ్డి, సుధాకర్ రెడ్డి, పత్రికాధిపతి వెంకట్రామిరెడ్డి, ప్రతాపరెడ్డి పోటీ పడుతున్నారు. అయితే పాల్వాయికి, సుధాకర్ రెడ్డికి అవకాశాలు తక్కువంటున్నారు.
ఐదో స్థానాన్ని సిపిఐ కేటాయించే అవకాశాలున్నాయి. ఈ విషయమై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. సిపిఐ తరుఫున రాజ్యసభ అభ్యర్థిగా అజీజ్ పాషాను గానీ, పువ్వాడ నాగేశ్వరరావును గానీ ఎంపిక చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ సీటు తమకు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పట్టుబడుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై పార్టీ అధిష్ఠానంతో చర్చించేందుకు కేశవరావు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు.