బాబ్లీని ఆపకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం: మధుయాస్కీ
నిజామాబాద్: ఈ నెల 30వ తేదీ తర్వాత మర్నాడు బాబ్లీ నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఆపకపోతే ప్రత్యక్ష పోరుకు దిగుతామని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధుయాస్కీ చెప్పారు. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరుగుతుందని, ఈ సమావేశం తర్వాత కూడా బాబ్లీ నిర్మాణం ఆపకపోతే మర్నాడు అన్ని విధాలా ప్రాజెక్టును ఆపించడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీని ఆపకపోతే జలవనరుల మంత్రి సైఫుద్దీన్ సోజ్కు, కేంద్ర జలవనరుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, ఆ రకంగా కూడా ఆగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు.
బాబ్లీ నిర్మాణం అంశాన్ని స్థల వివాదంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావ్ దేశ్ముఖ్ అనడాన్ని ఆయన ఖండించారు. కేవలం స్థలవివాదంగా పేర్కొంటూ విలాసరావ్ దేశ్ముఖ్ అయోమయం సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాబ్లీ నిర్మాణాన్ని ఆపేస్తామని మహారాష్ట్ర జలనవరుల సంఘానికి తెలియజేసిందని, ఇచ్చిన హామీకి భిన్నంగా నిర్మాణం కొనసాగిస్తోందని ఆయన అన్నారు.