కొల్లేరు పునరుద్ధరణలో మాకే ముప్పు: కృష్ణా కలెక్టర్
హైదరాబాద్: కోల్లేరు పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ ఆందోళన వ్యక్తం చేశారు. కొల్లేరు లీజుదారుల నుంచి ఉన్నతాధికారులకు భద్రతను కల్పించాలని ఆయన సుప్రీంకోర్టు సాధికారిక కమిటీని కోరారు. ఆదివారంనాడు కూడా సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ వాదనలు విన్నది. కొల్లేరు పునరుద్ధరణ విషయంలో తమ నుంచి ఎలాంటి వేధింపులు లేవని, వారి నుంచే తమకు ఒత్తిడి ఉందని ఆయన అన్నారు.
కొల్లేరు పునరుద్ధరణలో తాము మానవ హక్కులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. పునరుద్ధరణ పనుల సమయంలో లాఠీచార్జీ జరగలేదని, ఒక్క రక్తం బొట్టు కూడా చిందలేదని ఆయన అన్నారు. కొల్లేరు పునరుద్ధరణ విషయంలో కోర్టు, ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకున్నందున మానవ హక్కుల ఉల్లంఘన జరిగే అవకాశం ఏ మాత్రం లేదని ఆయన అన్నారు.