మొహాలీ టెస్టు: కష్టాల్లో పడ్డ ఇంగ్లాండు
మొహాలీ: రెండో ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో ఇంగ్లాండు భారత్తో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్లో పీకల లోతు కష్టాల్లో పడింది. ఆదివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు ఐదు వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ప్లింటాఫ్ 16 పరుగులతో, జోన్స్ ఒక పరుగుతో క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లాండు బ్యాట్స్మెన్లో బెల్ మాత్రమే నిలదొక్కుకోగలిగాడు. బెల్ 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కుంబ్లే బౌలింగ్లో అవుటయ్యాడు.
భారత బౌలర్లలో కుంబ్లే రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసుకున్నాడు. మునాఫ్ పటేల్కు, హర్భజన్ సింగ్కు ఒకటేసి వికెట్లు లభించాయి. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్లో భారత్ టెయిల్ ఎండర్స్ ప్రతిభతో ఇంగ్లాండు తొలి ఇన్నింగ్స్ స్కోరుపై 38 పరుగుల ఆధిక్యత సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 338 పరుగులు చేసింది. ద్రావిడ్ నిలకడగా ఆడి 95 పరుగులు చేయగా ఇర్ఫాన్ పఠాన్ అర్థ సెంచరీ సాధించాడు. పఠాన్ 52 పరుగులు చేశాడు. హర్భజన్ సింగ్ విలువైన పరుగులను భారత స్కోర్కు జత చేశాడు.