రాజ్యసభకు 14న కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
న్యూఢిల్లీ: రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగే ఎన్నికలకు అభ్యర్థులను ఈ నెల 14, 15 తేదీల్లో ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజశేఖర్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు, వైయస్ మిత్రుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.పి. రామచందర్ రావు ఆదివారంనాడు తమ నేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై వారు సోనియాతో చర్చించారు.
రాజ్యసభ అభ్యర్థులను తమ అధిష్ఠానమే ఖరారు చేస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. 14వ తేదీన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని దిగ్విజయ్ సింగ్ సోనియాతో భేటీ అనంతరం చెప్పారు. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులుగా కెవిపి రామచందర్ రావు, కె. కేశవరావు పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు, సరోజినీ పుల్లారెడ్డి, పి. సుధాకర్ రెడ్డి రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపికయ్యే అవకాశం ఉంది. దీంతో నలుగురు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేయనుంది.
ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి సైఫుద్దీన్ సోజ్ కలిశారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ఆయన సోజ్ను కోరారు. సత్వర సాగునీటి ప్రయోజనాల పథకం కింద రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు 600 కొట్ల రూపాయలు కేటాయించారని, దీని నుంచి మరిన్ని నిధులను తీసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రిని కోరారమని వైయస్ చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరినదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును ఆపేయాలని కూడా జల వనరుల మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. తమ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారని ఆయన చెప్పారు.