రాజ్యసభకు సిపిఐ అభ్యర్థి అజీజ్ పాషా
హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థిగా సిపిఐ నాయకత్వం సోమవారం అజీజ్ పాషా పేరును ప్రకటించింది. కాంగ్రెస్ తన మిత్రపక్షమైన సిపిఐ ఒక సీటును కేటాయిస్తోంది. ఆ సీటుకు అజీజ్ పాషాను ఎంపిక చేయడం విషయంలో ఏ విధమైన విభేదాలు తమ పార్టీలో తలెత్తలేదని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం. నారాయణ అన్నారు. ఒక సీటును తమకు కేటాయించినందుకు వారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని వారు విమర్శించారు. ఇదే విధానాలను కొనసాగిస్తే ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. మిత్రపక్షాలైన తమ మాటలను ఖాతరు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఓటు వేసే విషయంలో, అమెరికాతో అణు ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వైయస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని నారాయణ విమర్శించారు. కరెంట్ సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.