పదవికి జయశంకర్ రాజీనామా: ఇక ప్రజల్లోకి
న్యూఢిల్లీ: అసంఘటిత కార్మికుల జాతీయ కమీషన్ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సోమవారం ఆమోదించారు. తాను మూడు నెలల క్రితమే రాజీనామా చేశానని, అప్పటి నుంచి ఆమోదానికి ఒత్తిడి తెస్తూనే వున్నానని జయశంకర్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రత్యేక తెలంగాణకు సంబంధించి తన భావాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉందని, అందుకే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల జయశంకర్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఆ విషయాన్ని ఆయన బహిరంగంగా వెల్లడించడం లేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఏకాభిప్రాయం సాధించే కృషి కోసం ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందని తెరాస నాయకత్వం కోరినందుననే తాను ఆ పదవికి అప్పట్లో అంగీకరించానని, ఆ పని దాదాపుగా పూర్తయిందని, భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన నిర్ణయాన్ని ప్రకటిస్తే అది పూర్తిగా అయిపోయినట్లేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తానని ఆయన చెప్పారు. తాను రాజీనామా చేయడానికి అసంతృప్తికి ఏ మాత్రం సంబంధం లేదని ఆయన అన్నారు.