పోతిరెడ్డిపాడు ఉత్తర్వులు రద్దు చేయండి: టిడిపి
హైదరాబాద్: రాయలసీమలో తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను అన్నింటిని రద్దు చేయాలని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వల్ల మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని అధికార పక్షం శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి కూడా స్పష్టంగా చెబుతున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పోతిరెడ్డిపాడుకు వరద నీటిని మాత్రమే తరలిస్తామని అంటున్న ప్రభుత్వం మాటల్లో స్పష్టత లేదని ఆయన విమర్శించారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎత్తు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను తమ ప్రాంతాలకు మరణశాసనమని, తమ జీవన్మరణ సమస్య అని, ఈ విషయంపై తాము రాజీనామాలకైనా సిద్ధమేనని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడుపై శాసనసభలో చర్చ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ జలాలపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.