ఉస్మానియాలో జులుంపై అసెంబ్లీలో గంద్రగోళం
హైదరాబాద్: ఉస్మా నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపైన, తెలంగాణా మేథావులపైనా పోలీసులు సాగించిన జులుం గురువారం ఉదయం అసెంబ్లీని కుదిపేసింది. ఈ దుర్ఘటన చాలా హేయమైందని అటు మిత్రపక్షమైన టి.ఆర్.ఎస్. సభ్యులు, ఇటు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సభ్యులూ వాదిస్తూ ఈ సంఘటనపై సమాధానం చెప్పాలని, పండుగనాడు అన్యాయంగా పోలీసు జులుం ప్రదర్శించిన సి.ఐ. ని సస్పెండ్ చేయాలనీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
అయితే ఈ సంఘటన గురించిన పూర్వాపరాలను తెలుసుకుంటున్నామని, శుక్రవారం నాడు ఈ విషయమై ప్రకటన చేయగలమనీ హోమ్ శాఖ మంత్రి జానారెడ్డి వివరించారు. రేపటి వరకూ ఆగడానికి వీలులేదని వారు ఆందోళన వ్యక్తం చేయగా, జరిగిందంతా టి.వి. లో చూశామని, సి.ఐ. తప్పు స్పష్టంగా కనిపిస్తున్నందున ఆ సి.ఐ. పై వెంటనే చర్య తీసుకోవాలని తెలుగు దేశం నాయకుడు చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ విషయాన్ని మరింత పెద్దది చేసుకోవద్దని కూడా ఆయన సలహా ఇచ్చారు.