మంత్రి జెసి వ్యాఖ్యలపై అట్టుడికిన అసెంబ్లీ
హైదరాబాద్: కరీంనగర్లో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి వ్యవహారంపై సోమవారం శాసనసభలో దుమారం చెలరేగింది. జెసి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం చెప్పాయి. అయితే జెసి దివాకర్ రెడ్డి తన ప్రవర్తనను సమర్థించుకున్నారు. తాను ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అలా చేసి వుంటే బహిరంగ క్షమాపణ చెప్పడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన అన్నారు. ఒక విలేకరి తనను పదే పదే విసిగించాడని, దాంతో అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని మాత్రమే అన్నానని ఆయన వివరణ ఇచ్చారు.
మీడియా తన వ్యాఖ్యలను వక్రీరించిందని కూడా మంత్రి ఆరోపించారు. జెసి దివాకర్ రెడ్డి వ్యవహారంపై ప్రతిపక్షాలు పోడియం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యుడు టి. దేవేందర్ గౌడ్కు, మంత్రి రఘవీరారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. దివాకర్ రెడ్డిపై 32 హత్య కేసులున్నాయని దేవేందర్ గౌడ్ అన్నారు. దీనికి మంత్రి రఘువీరారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. "కేసులుంటే మీ ప్రభుత్వ హయాంలో గాజులు తొడుక్కున్నారా? మంత్రి రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. దీనికి తెలుగుదేశం మహిళా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
తనకు మహిళలపై గౌవరం ఉందని, మహిళలు తన అక్కాచెల్లెళ్లు, తల్లులాంటివారని, మహిళలను అవమానించే ఉద్దేశంతో తాను అనలేదని, తాను అన్న సందర్భం వేరని మంత్రి వివరణ ఇచ్చారు. అయినా తెలుగుదేశం సభ్యులు సద్దుమణగలేదు. గాజులు తొడుక్కున్న మహిళలందరూ అసమర్థులనే భావన మంత్రికి వుంటే, తల్లులు, అక్కాచెల్లెళ్లు వేసుకునే గాజులు వేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, వాటిని తెప్పించాలని దేవేందర్ గౌడ్ తీవ్రంగా అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జోక్యం చేసుకుని - తనకు మహిళలను కించపరిచే ఉద్దేశం లేదని మంత్రి స్పష్టంగా చెప్పారని, మగవాళ్లలో గాజులు ఎవరు వేసుకుంటారో అందరికీ తెలుసునని అన్నారు.