జెసి వ్యవహారం పరిశీలిస్తా: ముఖ్యమంత్రి
హైదరాబాద్: మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి మీడియాపై చేసినట్లు వచ్చిన వార్తను పత్రికల్లో చూశానని, దాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి జర్నలిస్టు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. జెసిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం నాయకులు సోమవారం ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. జెసి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
శాసనసభ ఆవరణలో జెసి దివాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశాలన్ని విలేకరులు బహిష్కరించారు. జెసి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జర్నలిస్టులు ధర్నా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏడవ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కృష్ణా జిల్లా గుడివాడలో జెసి దిష్టిబొమ్మను జర్నలిస్టులు దగ్ధం చేశారు. నల్లగొండలో జర్నలిస్టులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రాస్తారోకో నిర్వహించారు. మంత్రిపదవి నుంచి జెసి దివాకర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.