తెలంగాణపై యుపిఎ నిర్లిప్తత: రాజ్నాథ్
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ విమర్శించారు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి వున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాయని, ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. తెలంగాణపై ఏర్పాటయిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ నుంచి తనకు ఏ విధమైన లేఖ రాలేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ ఏర్పాటును వామపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లును ప్రతిపాదించడానికి కాంగ్రెస్ సాహసం చేయడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే వామపక్షాలు యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాయని కాంగ్రెస్ భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రణబ్ కమిటీకి రాజ్యాంగబద్దత లేదని, అందువల్ల ఆ కమిటీకి తాము లేఖ రాయబోమని ఆయన చెప్పారు.