పట్టణ గరిష్ట భూపరిమితి అక్రమాలపై న్యాయవిచారణ
హైదరాబాద్: పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం అమలులో అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి చెప్పారు. సభా సంఘం వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా న్యాయవిచారణకు ప్రభుత్వం అంగీకరించింది. పట్టణ గరిష్ట భూపరిమితి చట్టం అమలులో అవకతవలపై సభా సంఘం వేయాలని సిపియం, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు పట్టుబట్టడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సభ సద్దుమణగకపోవడంతో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.
ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అక్రమంగా పంచిందని తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ అంతకు ముందు ఆరోపించారు. భూములను ఇవ్వడంలో తాము గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రూపొందిన నిబంధనలనే పాటిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. ఈ వ్యవహారాలపై న్యాయ విచారణ జరిపించాలని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. తాము చేసిన తప్పులపై, ఇప్పుడు జరిగిన తప్పులపై విచారణకు ఆదేశించాలని ఆయన సూచించారు.