ఎల్లంపల్లి చర్చపై ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమే: సిపియం
కడప: ఎల్లంపల్లి ప్రాజెక్టుపై జరిగిన చర్చ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి విఘాతమని సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. ఉద్దేశ్యపూర్వకంగానే శాసనసభలో ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చర్చను ప్రభుత్వం సుదీర్ఘంగా కొనసాగించిందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై 20 రోజుల పాటు జరిగిన చర్చ నిరుపయోగంగా మారిందని ఆయన అన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ఫైళ్లను ప్రభుత్వం స్పీకర్ ముందు ఉంచకపోవడం సముచితం కాదని ఆయన అన్నారు. వాస్తవాలు ప్రజల ముందుకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహారం నడిపిందని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అక్రమాలపై చర్చను, వ్యవహారాలను సుదీర్ఘంగా కొనసాగించడం ద్వారా ప్రజల్లో విసుగు పుట్టించి వాస్తవాలను తెలుసుకోవడంపై గల ఆసక్తిని నశింపజేయడానికి ప్రభుత్వం పూనుకుందని ఆయన అన్నారు.