కోస్తా ఎమ్మెల్యేల సంతకాలే సాక్ష్యం: కెసిఆర్
సిద్ధిపేట: సమైక్యాంధ్రలో తెలంగాణకు న్యాయం జరగదని, వంద మంది కోస్తా శాసనసభ్యుల సంతకాల సేకరణే అందుకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అగ్రనేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యపడుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రణబ్ కమిటీకి లేఖ రాయాల్సిన అవసరం లేదని, బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటన సరిపోతుందని ఆయన అన్నారు.
కెసిఆర్ బుధవారంనాటి నుంచి చండీయాగం నిర్వహిస్తున్నారు. తాను చాలా కాలంగా యాగం నిర్వహిస్తున్నాని, తనకు విశ్వాసం ఉండడం వల్లనే యాగం నిర్వహిస్తున్నానని ఆయన అన్నారు. చండీయాగం వల్ల లక్ష్యాలు నెరవేరుతాయనే విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు. చండీయాగానికి దళితులను రానివ్వక పోవడం అనే విషయంతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. చండీయాగం నుంచి బుధవారంనాడు దళితులను వెళ్లగొట్టడం వివాదంగా మారింది.